చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం సృష్టించింది. 12 మందికి కరోనా పాజిటివ్గా గురువారం నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ నేపథ్యంలో దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడులో కూడా బుధవారం 31 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం ఒక్క ఐఐటీ మద్రాస్లోనే 12 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
మరోవైపు దేశంలో వరుసగా రెండో రోజూ కూడా రెండు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం 2067 మంది కరోనా బారినపడగా, గురువారం కొత్తగా 2380 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 13,433 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.53 శాతానికి పెరిగింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,49,974కు పెరిగింది. గత 24 గంటల్లో 56 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,22,062కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.