Kuno National Park | మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్కు త్వరలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుత పులులు రానున్నాయి. ఇందుకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. చిరుతలను భారత్కు తరలించేందుకు గత మూడున్నర నెలలుగా చిరుతలను సౌతాఫ్రికాలో క్వారంటైన్లో ఉంచారు. ఈ నెల 15వ తేదీ నాటికి షియోపూర్ కునో పార్క్కు తీసుకురానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పార్కులో కొత్తగా వచ్చిన చిరుతల కోసం ఎనిమిది కొత్త ఎన్క్లోజర్లను నిర్మించగా సిద్ధమయ్యాయి. భారత్తో చిరుతల తరలింపు ప్రాజెక్టు అవగాహన ఒప్పందాన్ని దక్షిణాఫ్రికా అటవీ, పర్యావరణ మంత్రి బార్బరా క్రిసీ ఆమోదముద్ర వేశారు.
ఈ ఫైల్ అధ్యక్షుడు సిరిల్ రామఫోస వద్దకు చేరింది. ఇదిలా ఉండగా.. గత సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్క్లో చిరుతలను ప్రధాని మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. కొంతకాలం క్వారంటైన్లో ఉంచిన అనంతరం చిరుతలను పెద్ద ఎన్క్లోజర్లకు వదిలారు. గత జూలైలో చీతా ప్రాజెక్టు కోసం 12 చిరుత పులులను ఇవ్వాలని భారత్ గత జూలైలో దక్షిణాఫ్రికాను కోరింది. నమీబియా నుంచి చిరుతలను తరలించిన సమయంలోనే 12 చిరుతలు రావాల్సి ఉండగా.. ఎంఓయూను ఆమోదించకపోవడంతో ఆలస్యమైంది.
సౌతాఫ్రికా అధ్యక్షుడు రెండుమూడు రోజుల్లో ప్రాజెక్టు ఫైల్పై సంతకం చేసే అవకాశం ఉందని, ఈ తర్వాత 12 చిరుతలను భారత్కు తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంతకు ముందు నమీబియా నుంచి ఎనిమిది చిరుత పులులు భారత్కు రాగా.. కునోలో మొత్తం 14 ఎన్క్లోజర్లు ఉన్నాయి. ప్రాజెక్టు ఫైల్పై సంతకం తర్వాత చిరుతలను తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నేషనల్ కునో అభయారణ్యం డీఎఫ్వో ప్రకాశ్ శర్మ తెలిపారు. కునోలో మరో ఎనిమిది కొత్త ఎన్క్లోజర్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని, ఇంతకుముందు ఉన్న ఆరు ఎన్క్లోజర్లు కూడా కునోలో ఉన్నాయని వివరించారు.