ముంబై/ కొత్తగూడెం క్రైం, జూలై 17 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఓ ఎస్సై, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ కథనం ప్రకా రం.. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా వండోలి గ్రామ సమీపంలో సుమారు 15 మంది మావోయిస్టులు ప్రచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చేపట్టగా వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఎస్ఐ సతీశ్ పాటిల్, మరో ఇద్దరు జవాన్లు గాయపడగా వారిని హెలికాప్టర్లో తరలించారు.
కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు ఏకే-47లు, రెండు ఇన్సాస్లు, ఒక కార్బైన్, ఒక ఎస్ఎల్ఆర్, ఇతర వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిప్పగఢ్ దళానికి చెందిన డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం, విశాల్ ఆత్రం ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆపరేషన్ గురించి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ గడ్చిరోలి పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తనకు ఎస్పీ, ఐజీలు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని చెప్పారు. గడ్చిరోలి పోలీసులను అభినందించారు. వారికి 51 లక్షల రివార్డును ప్రకటించారు.