చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళకు చెందిన రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయం పన్ను శాఖ అధికారులు జప్తు చేశారు. 1991-96 మధ్య తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నప్పుడు పయనూర్ గ్రామంలో శశికళ ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. అయితే 2014లో ఈ 11 ఆస్తులను ఆదాయానికి మించిన ఆస్తులుగా పేర్కొంటూ అప్పటి కర్ణాటక స్పెషల్ కోర్టు జడ్జి జాన్ మిచేల్ కున్హా తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఆస్తులను జప్తు చేశారు. కాగా, ఈ ఆస్తులను అప్పట్లో రూ.20 లక్షలకు కొనుగోలు చేసినట్టు సమాచారం.