Doctors | హైదరాబాద్, మార్చి 5: (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏడాది గడిచినా ఇప్పటికీ దాదాపు 10 వేల మంది చదువుపై స్తబ్ధత కొనసాగుతున్నది. గత ఏడాది ఫిబ్రవరి 24 నుంచి యుద్ధం మొదలుకాగా.. మొత్తం 22 వేల మంది భారతీయ విద్యార్థులు వెనక్కి తిరిగి వచ్చారు. ఇందులో 18 వేల మంది వైద్య విద్యార్థులే. ఇలా తిరిగి వచ్చినవారి చదువు కొనసాగింపుపై ఇప్పటికీ హైడ్రామా కొనసాగుతున్నది.
ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ‘పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్’ (పీఏయూఎంఎస్) పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటుచేసుకొని పోరాడుతున్నారు. వీరి లెక్కల ప్రకారం దాదాపు 3,000 మంది విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్కు వెళ్లిపోయి తమ చదువు కొనసాగిస్తున్నారు. మరో 3 వేల మంది ఇతర దేశాల్లో చేరిపోయారు. దాదాపు వెయ్యి మంది ఈ ఏడాది నిర్వహించిన నీట్లో బాగా రాసి ర్యాంకు సంపాదించారు. ఇంకొందరు విద్యార్థులు ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. మిగతా 10 వేల మంది భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఇందులో కొందరు కొత్త దేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుండగా, మరికొందరు వైద్య విద్యకు దండంపెట్టి ప్రత్యామ్నాయ కోర్సుల వైపు చూస్తున్నారు.
దాదాపు మూడు వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్ కాలేజీల్లో చేరిన మూడు నెలలకే తిరిగి వచ్చారని, వారి భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదని పీఏయూఎంఎస్ అధ్యక్షుడు ఆర్బీ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. చివరి సంవత్సరం, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు పెద్దగా నష్టం కలగలేదని, వారు తిరిగి వచ్చిన తర్వాత కోర్సు పూర్తి చేశారని వెల్లడించారు. తన కొడు కు సెర్బియాకు వెళ్లినట్టు చెప్పారు. పోలండ్, రష్యా, సెర్బియా, జార్జియా వంటి దేశాలకు అనేక మంది వెళ్లారని పేర్కొన్నారు.
విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాల్సిన పలువురు విద్యార్థులు ఇటీవల ఇక్కడ నీట్ రాసి బీడీఎస్, బీఏఎంఎస్ వంటి కోర్సుల్లో చేరారని చెప్పారు. కొన్ని యూనివర్సిటీలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా.. ఎంతవరకు ఇలా కొనసాగాలి? ప్రాక్టికల్స్, ఇంటర్న్షిప్ ఎలా అనే ఆందోళన మొదలైందని విద్యార్థి ఆశిష్కుమార్ సోధి చెప్పారు. మెడిసిన్ను ఆన్లైన్లో చదవడం మంచి ఆలోచన కాదని, అయినా తప్పడం లేదని పేర్కొన్నారు. నేరుగా వచ్చి చేరుతామని చెప్పినా ఆయా యూనివర్సిటీలు రానివ్వడం లేదని, చివరి సంవత్సరం విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నాయని వాపోయారు.
దాదాపు 10 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నదని పీఏయూఎంఎస్ ఆరోపిస్తున్నది. ఎన్ఎంసీ ఆధ్వర్యంలో విద్యార్థులు తిరిగి ఏయే దేశాలకు వెళ్లి అడ్మిషన్లు పొందవచ్చో మాత్రమే ఓ జాబితా ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడుతున్నారు. ప్రతి విద్యార్థి చదువు కొనసాగేలా బాధ్యత తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.