న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తునకు భయపడే ప్రసక్తే లేదని ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. అయితే ఇదే సమయంలో బీజేపీ పాలిత గుజరాత్లో జరుగుతున్న కుంభకోణాలతో పాటు యూపీలో బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేను ప్రధాని మోదీ ప్రారంభించిన ఐదు రోజులకే దానిపై పగుళ్లు రావడం, వర్షాలకు కొన్నిచోట్ల కొట్టుకుపోవడం జరిగిందని, దీని వెనుక జరిగిన అవినీతిపై వాస్తవాలను నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో సిసోడియా మాట్లాడుతూ గుజరాత్లో ప్రతి ఏటా జరుగుతున్న 10 వేల కోట్ల మేర కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని అన్నారు. ఎక్సైజ్ పన్ను ఎగవేత రూపంలో రాష్ట్రంలో ప్రతి ఏడాది ఇంత భారీ మొత్తంలో స్కాం జరుగుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో లిక్కర్పై నిషేధం ఉన్నప్పటికీ.. కల్తీ మద్యం ఏరులై పారుతున్నదని, దీని కారణంగా అనేక మంది చనిపోతున్నారని అన్నారు.
ఆప్ను అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు..
కొత్త ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికపై తనకు తెలియదని సిసోడియా అన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీతో సీబీఐ, లెఫ్టినెంట్ గవర్నర్, చీఫ్ సెక్రటరీ చేతులు కలిపారని ఆరోపించారు. 2024లో గెలుపు సాధ్యం కాదనే భయంతో కేజ్రీవాల్ను అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీపై మాజీ ఎల్జీ అనిల్ బైజాల్ చివరి నిమిషంలో తన వైఖరి మార్చుకోవడానికి గల కారణంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎక్సైజ్ పాలసీ స్కామ్లో కేజ్రీవాల్ది కీలక పాత్ర అని బీజేపీ ఆరోపించింది. అవినీతి బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయనకి చేతులకు సంకెళ్లు పడే సమయం దగ్గరపడుతున్నదని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు.
నోటీసులు ఇచ్చారు.. ఇవ్వలేదు!
ఎక్సైజ్ పాలసీ కేసులో లుకౌట్ నోటీసుల అంశం ఆదివారం కాక రేపింది. సీబీఐ తనపై లుకౌట్ నోటీసులు ఇచ్చిందని సిసోడియా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయితే సిసోడియాతో పాటు మరో ముగ్గురు ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులపై ఎటువంటి లుకౌట్ నోటీసులు ఇవ్వలేదని, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఎనిమిది మంది ప్రైవేటు వ్యక్తులపై మాత్రమే ఇచ్చామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. తనకు సీబీఐ లుకౌట్ నోటీసులు ఇచ్చిందని పేర్కొంటూ సిసోడియా ట్విట్టర్ వేదికగా మోదీ సర్కార్పై మండిపడ్డారు. సోదాల్లో సీబీఐ ఏం గుర్తించలేదని, ఇప్పుడు సిసోడియా కనిపించడం లేదంటూ నోటీసులు ఇచ్చారని, ‘ఈ నాటకాలేంటి మోదీజీ?’ అని ప్రశ్నించారు. ‘నేను ఢిల్లీలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాను. ఎక్కడికి రావాలో చెప్పండి?’ అని సవాల్ విసిరారు. ఎవరికి వ్యతిరేకంగా సీబీఐ లుకౌట్ నోటీసులు జారీచేయాలా అనేదానిపైనే ప్రధాని మోదీ నిత్యం ఆలోచన చేయడం దురదృష్టకరమని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి పరిష్కారం చూపగల నాయకుడి కోసం దేశం నేడు ఎదురుచూస్తున్నదని, 2024లో ప్రజలు బీజేపీకీ తప్పకుండా ‘లుకౌట్ నోటీసులు’ ఇస్తారని వ్యాఖ్యానించారు.
ఇలా అయితే దేశ పురోగతి ఎలా?: కేజ్రీవాల్
కేంద్రంలోని మోదీ సర్కార్ దర్యాప్తు సంస్థలను వినియోగించుకొంటున్న తీరుపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తదితర సమస్యలపై రాష్ర్టాలతో కలిసి పోరాడాల్సిన సమయంలో కేంద్రం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదని, ఇలాగైతే దేశం ఎలా పురోగతి సాధిస్తుందని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవడం.. సీబీఐ, ఈడీ ఆట ఆడటాన్నే పనిగా పెట్టుకున్నదని విమర్శించారు. కాగా, ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన వెయ్యి లోఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సిఫారసుపై విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. కాగా, అవినీతి ఆరోపణలను కేజ్రీవాల్ సర్కార్ ఖండించింది. కేంద్రం సీబీఐని వినియోగించుకొని తమ ప్రభుత్వాన్ని వేధిస్తున్నదని పేర్కొన్నది.