బెంగళూరు : ఇండియాలో తొలిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరి వయసు 66 కాగా, మరొకరి వయసు 46 అని అధికారులు పేర్కొన్నారు. అయితే నవంబర్ 12 నుంచి 22వ తేదీ మధ్యలో బెంగళూరుకు వచ్చిన 10 మంది దక్షిణాఫ్రికా వాసులు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ కనుగొనేందుకు కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
బెంగళూరు ఎయిర్పోర్టులో వారు మొబైల్ నంబర్లు ఇచ్చినప్పటికీ అవి పని చేయడం లేదు. స్విచ్ఛాఫ్ అని వస్తోంది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ వ్యక్తులను కనుగోనేందుకు ఆరోగ్య శాఖ అధికారులు.. పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. నవంబర్ 22వ తేదీ నుంచి అన్ని ఎయిర్పోర్టుల్లో అధికారులు నిఘా పెట్టారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించిన దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.