నిరసనలకు జడిసి కేంద్రం మార్పులు
న్యూఢిల్లీ, జూన్ 18: కేంద్రప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది. అగ్నిపథ్ కార్యక్రమాన్ని హడావుడిగా తీసుకొచ్చి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కాగానే కార్యక్రమంలో ఒక్కొక్కటిగా సవరణలు ప్రకటిస్తున్నది. అగ్నివీరులకు అది చేస్తాం.. ఇది చేస్తాం. అని హామీలు ఇస్తున్నది. రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగాల్లో, సీఎపీఎఫ్లో, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో అర్హులైన అగ్నివీరులకు 10% రిజర్వేషన్ ఉంటుందని కేంద్రప్రభుత్వం శనివారం ప్రకటించింది. అంతే కాకుండా ఇతర అభ్యర్థులతో పోల్చితే మూడేండ్ల వయో సడలింపు కూడా ఉంటుందని తెలిపింది.
రక్షణ శాఖ ఉద్యోగాల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ఆమోదం తెలిపారు. అంతకుముందు నేవీ చీఫ్, ఎయిర్ఫోర్స్ చీఫ్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్లతో సమావేశమయ్యారు. ‘ఇండియన్ కోస్టుగార్డు, రక్షణశాఖ సివిల్ పోస్టులు, 16 రకాల రక్షణ రంగ సంస్థల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ ఉంటుంది’ అని రక్షణమంత్రిత్వ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న ఎక్స్-సర్వీస్మెన్ కోటాకు అదనం అని తెలిపింది. మరోవైపు, హౌజింగ్, పెట్రోలియం మంత్రిత్వశాఖ కింద ఉన్న ప్రభుత్వ సంస్థల్లో అగ్నివీరులను చేర్చుకొనే మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు.