న్యూఢిల్లీ: మణిపూర్లో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తగ్గుముఖం పడుతున్న వేళ మరో రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది. కుకి గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక పాలన కిందకు తీసుకురావాలని, దీనికి రాష్ట్ర హోదా కల్పించాలని, ‘ప్రత్యేక పాలనా ప్రాంతం’గా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకున్నది. రాష్ట్ర సీఎం బిరేన్సింగ్ ఈ డిమాండ్ను తిరస్కరించిన కొద్దిగంటల్లోనే, 10 మంది ఎమ్మెల్యేలు గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. లేఖ రాసిన ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీ వారున్నారు.