హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు అక్షరాల రూ.10,09,511 కోట్ల మొండి రుణ బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులోనే ప్రకటించారు. మంగళవారం రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానమిచ్చారు. రుణాల ఎగవేతకు తమ ప్రభుత్వం కారణం కాదని, బాధ్యత మొత్తం బ్యాంకుల అధికారులదేనని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులు విల్ఫుల్ డిఫాల్టర్లేనని (ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు) సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వేసిన ఓ పిటిషన్కు ప్రభుత్వమే బదులిచ్చింది. ఇదే విషయాన్ని గత ఆగస్టులో ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్ కరాడ్ రాజ్యసభలోనూ లిఖితపూర్వకంగా తెలిపారు.
విల్ఫుల్ డిఫాల్టర్ల జాబితాలో చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ మొదటి స్థానంలో ఉన్నట్టు వెల్లడించారు. విజయ్మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీకి చెందిన వజ్రాల కంపెనీలకు రుణాలు మంజూరు చేయాలంటూ అధికార పార్టీ నేతలు కొందరు సిఫారసు చేసినట్టు ఓ బ్యాంకు అధికారి బాహాటంగానే ఆరోపించారు. ఓ ఆర్టీఐ పిటిషన్కు ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు కూడా ఇదే విధంగా సమాధానమిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే కార్పొరేట్లు రుణాలు ఎగ్గొడుతున్నారని, అప్పు తిరిగి చెల్లించే స్థోమత ఉన్నప్పటికీ చెల్లించడం లేదని ఆర్బీఐ స్వయంగా వెల్లడించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా తమ తప్పును కప్పిపుచ్చుతూ.. బ్యాంకులదే మొత్తం తప్పు అన్నట్టు ఆర్థికమంత్రి వ్యాఖ్యానించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి.
మూలధనం కంటే రైటాఫ్లు మూడు రెట్లు
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ దేశంలోని బ్యాంకులు రూ.14.38 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను రైటాఫ్ చేశాయి. ఇందులో దాదాపు 70 శాతం రైటాఫ్లు (రూ.9,93,281 కోట్లు) ప్రభుత్వరంగ బ్యాంకులు చేసినవే. బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం బ్యాంకులకు ఇచ్చిన మూలధనం రూ.3.37 లక్షల కోట్లు కాగా, రైటాఫ్లు 9.93 లక్షల కోట్లు. అంటే ప్రభుత్వం బ్యాంకుల్లో పెట్టిన పెట్టుబడి కంటే రైటాఫ్లే మూడింతలు ఉన్నట్టు అర్థమవుతున్నది. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు తహతహలాడుతున్న బీజేపీ సర్కారు.. అవే బ్యాంకుల నుంచి తమ అనుయాయులకు రుణాలు ఇప్పించడం, అనంతరం వాటిని ఎన్పీఏలుగా మార్చి రైటాఫ్లు చేయించడం.. తర్వాత నెపాన్ని బ్యాంకు అధికారులపైకి నెట్టేయడం పరిపాటిగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్పీఏలకు బ్యాంకు అధికారులే కారణం
న్యూఢిల్లీ: దేశంలో బ్యాంకులు పెద్ద ఎత్తున మొండి బకాయిలను వాటి ఖాతా పుస్తకాల్లోంచి తొలగించాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ఎస్సీబీలు) రూ.10,09,511 కోట్ల విలువైన ఎన్పీఏలను రైటాఫ్ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు తెలిపారు. ఎన్పీఏలకు బ్యాంకు అధికారులే కారణమని వెల్లడించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మొండి బకాయిలను, కేటాయింపులు జరిపిన నిరర్థక రుణాలను నాలుగేండ్ల తర్వాత బ్యాంకులు వాటి ఖాతాపుస్తకాల్లోంచి రైటాఫ్ చేస్తాయని రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి వివరించారు. బ్యాంకులు వాటి బ్యాలెన్స్ షీట్ను శుద్ధిచేసే సాధారణ ప్రక్రియలో భాగంగానే ఎన్పీఏలను రైటాఫ్ చేస్తాయని తెలిపారు. తద్వారా బ్యాంకులు పన్ను ప్రయోజనాలు పొందుతాయని, మూలధనాన్ని గరిష్ఠస్థాయిలో వినియోగించుకోగలుగుతాయని చెప్పారు. గత ఐదేండ్లలో ఎస్సీబీలు రూ.6,59,596 కోట్లు రికవరీ చేసుకున్నాయని, అందులో రైటాఫ్ చేసిన రుణ ఖాతాల నుంచి వసూలైన రూ.1,32,036 కోట్లు ఉన్నాయని తెలిపారు. రుణాలు రైటాఫ్ జరిగినా, సంబంధిత రుణగ్రస్తులు రుణాలు చెల్లించాల్సిందేనని, రికవరీ ప్రక్రియను బ్యాంకులు కొనసాగిస్తాయని పేర్కొన్నారు.