న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. సుప్రీంకోర్టులో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. అత్యున్నత న్యాయస్థానంలో ఇప్పటివరకు 10 మంది న్యాయమూర్తులు మహమ్మారి బారినపడగా, సుమారు 4 వందల మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో బాధితులకు న్యాయసహాయం అందించడ ఆలస్యమవుతుండగా, న్యాయమూర్తులకు కేసులు కేటాయిండంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సుప్రీంకోర్టులోని 32 మంది జడ్జిల్లో ఇప్పటివరకు పది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో జస్టిస్ కేఎం జోసెఫ్, పీఎస్ నరసింహ కరోనా నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు.
అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రతిరోజు 100 నుంచి 200 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నది. దీంతో ప్రతిరోజు సరాసరి 30 శాతం కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కోర్టులో మొత్తం 15 వందల మంది సిబ్బంది ఉండగా సుమారు 4 వందల మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు.