గురుగ్రామ్, జూలై 22: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను కలుసుకునేందుకు గురుగ్రామ్లోని మేదాంత దవాఖానకు చేరుకున్న విపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని హర్యానా పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. ప్రతినిధి బృందంలో ఆప్, జేఎంఎం, సమాజ్వాది పార్టీ ఎంపీలు ఉన్నారు. వాంగ్చుక్ కుటుంబ సభ్యులను మాత్రమే దవాఖానలోకి అనుమతిస్తామని విపక్ష ఎంపీలకు పోలీసులు తెలిపారు. దీంతో దవాఖాన గేటు వద్ద ఎంపీలు బైఠాయించి పోలీసుల వైఖరికి నిరసన తెలియచేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ వైఖరిని అవలంబిస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు. వాంగ్చుక్ను కలుసుకునేందుకు బీజేపీ ఎంపీలను అనుమతించిన పోలీసులు విపక్ష ఎంపీలను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. అనంతరం వాంగ్చుక్ భార్య గీతాంజలి వాంగ్చుక్ దవాఖాన గేటు వెలుపల విపక్ష ఎంపీలను కలుసుకున్నారు. ‘25 రోజులుగా ఆహారం తీసుకోని ఒక భారతీయ పౌరుడికి ప్రశాంతత లేకుండా చేసి ఆయనను తీవ్ర ఒత్తిడికి గురిచేయడం చాలా సిగ్గుచేటు’ గీతాంజలి అన్నారు.