Karnataka | బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో విషాదం నెలకొంది. హోస్కోటేలోని ఓ ఆలయం వద్ద పంచి పెట్టిన ప్రసాదం తిని ఓ మహిళ మృతి చెందగా, మరో 70 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరికి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. హోస్కోటేలోని ఓ ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే రోజు మాదిరిగానే అక్కడ శనివారం కూడా ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు. ఇక భక్తులు ప్రసాదం సేవించి, తమ తమ నివాసాలకు చేరుకున్నారు. ఆదివారం నాడు 70 మంది దాకా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఓ మహిళ సోమవారం ఉదయం మృతి చెందింది. పలువురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రసాదం సేవించని ఇతర భక్తులకు ఎలాంటి వాంతులు, విరేచనాలు కాలేదని అధికారుల విచారణలో తేలింది.