న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి గొంతు నొక్కేందుకు, వారిని బెదిరించేందుకే దర్యాప్తు సంస్థలకు విశేష అధికారాలు ఇస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మండిపడింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలపై ఐటీ దాడులు జరగడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. మోదీ సర్కారు ఈ ‘అణచివేత కుయుక్తుల’ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. పౌర సంస్థలు ప్రతీకార భయం లేకుండా పనిచేసే వాతావరణం కల్పించాలని కోరింది.
పన్ను ఎగవేత, ఎఫ్సీఆర్ఏ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఆదాయ పన్ను విభాగం బుధవారం పలు రాష్ర్టాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలపై దాడులు చేసింది. ఆదాయ పన్ను విభాగం సర్వే పేరుతో పలు పౌర సంస్థలపై ఏకకాలంలో దాడులు చేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ యామినీ మిశ్రా తెలిపారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే స్వచ్ఛంద సంస్థల గొంతు నొక్కేందుకు, భయపెట్టేందుకు, నేరారోపణ చేసేందుకే ప్రభుత్వం ఆర్థిక, దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నదని ధ్వజమెత్తారు. ప్రతిరోజు భారత్లో జరుగుతున్న భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు అత్యంత ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.