న్యూఢిల్లీ : కొవిడ్ టీకా బూస్టర్ డోస్ (మూడో మోతాదు) ఆవశ్యకతపై ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు లేవని, నిపుణులు శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. బూస్టర్ డోస్ ఆవశ్యకతపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రస్తుతం భారత్లో కొవిడ్ టీకా అందించే రోగ నిరోధక శక్తి వ్యవధి గురించి ప్రస్తుత పరిజ్ఞానం పరిమితంగా ఉందని, కొంత వ్యవధిలో మాత్రమే స్పష్టంగా తెలుస్తుందని ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖలోని ఇమ్యునైజేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు.
రాకేశ్ మల్హోత్ర దాఖలు చేసిన పిటిషన్ మేరకు.. కోర్టు కేంద్రం స్పందన కోరింది. కొవిడ్ వ్యాక్సిన్ల బూస్టర్ డోస్ల నిర్వహణ ఆవశ్యకత తెలుసుకోవాలని గత నెల 25న హైకోర్టు కేంద్రాన్ని కోరింది. అయితే, ఇప్పటి వరకు మూడో డోస్పై ఎలాంటి నిర్ధిష్ట మార్గదర్శకాలు లేవని, కోవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్పై నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ (ఎన్ఈజీవీఏసీ) టీకా కార్యక్రమానికి మార్గనిర్దేశం చేయడానికి రెండు నిపుణులతో కూడిన సంస్థలు పని చేస్తున్నాయని పేర్కొంది.
ఎన్టీఏజీఐ వివిధ రకాల కొవిడ్ టీకాల వినియోగం, మోతాదుల మధ్య విరామం, వ్యతిరేక సూచనలు మొదలైన సాంకేతిక అంశాలను పరిశీలించి మంత్రిత్వ శాఖకు అన్ని అంశాలపై మార్గదర్శకాలు, సిఫారసులు చేస్తుందని చెప్పింది. ఎన్టీఏజీఐ, ఎన్ఈజీవీఏసీ కొవిడ్ టీకాల మోతాదు షెడ్యూల్తో పాటు బూస్ట్ డోస్ల ఆవశ్యకత, సమర్థతకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలపై సమాచారాన్ని సేకరిస్తున్నాయని వివరించింది.