న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ‘ముందస్తు జాగ్రత్త డోసు (ప్రికాషనరీ డోసు)’ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు ఇది పనిచేస్తుందని భావిస్తున్నారు. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లు, 60 ఏండ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ప్రస్తుతం ఈ బూస్టర్ డోసు వేయనున్నారు. రెండో డోసు వేసుకున్న 9 నెలల తర్వాతే బూస్టర్కు అర్హులు. మొదటి రెండు డోసులు వేసిన వ్యాక్సిన్నే ముందస్తు డోసుగా ఇవ్వనున్నారు. 60 ఏండ్లు పైబడి హృద్రోగ సమస్యలు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ రోగులు, కాలేయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, సికిల్ సెల్ అనీమియా తదితర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఈ డోసుకు అర్హులు అని చెబుతున్నారు.
కరోనా బుసలు
దేశంలో ఆదివారం ఒక్కరోజే 1,59,632 కరోనా కేసు లు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,623 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, 1,409 మంది కోలుకున్నారు. కరోనా పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఒక్కరోజులో 327 కరోనా మరణాలు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 4,83,790కి చేరుకుంది.
400 మంది పార్లమెంటు సిబ్బందికి కరోనా
400 మంది పార్లమెంటు సిబ్బందికి వైరస్ సోకింది. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఇంతమంది సిబ్బందికి కరోనా సోకడం కలకలం రేపుతున్నది. సుప్రీంకోర్టులోని నలుగురు జడ్జిలకూ కరోనా సోకింది. న్యాయస్థానంలోని 150 మంది సిబ్బంది క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.
బూస్టర్తో 90 శాతం రక్షణ
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నుంచి బూస్టర్ డోసు 90% మేర రక్షణ ఇస్తుందని యూకే హెల్త్ సెక్యురిటీ ఏజెన్సీ అధ్యయనం చెబుతున్నది. ఇప్పటివరకు బ్రిటన్లో 1.5 లక్షల కరోనా మరణాలు నమోదయ్యాయి. కాగా, ప్రజలందరూ మాస్కులు వేసుకుంటే లాక్డౌన్ విధించబోమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో సెలూన్లు, జిమ్లను 50 శాతం సామర్థ్యంతోనే నడపాలని ప్రభుత్వం ఆదేశించింది.