పట్నా: బీహార్లోని నలందా మెడికల్ కాలేజీ, దవాఖానలో (NMCH) కరోనా కలకలం కొనసాగుతున్నది. సోమవారం 72 మంది డాక్టర్లు కరోనా బారినపడగా, కొత్తగా మరో 59 మంది వైద్యులకు వైరస్ సోకింది. దీంతో మొత్తం సంఖ్య 143కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం మెడికల్ కాలేజీలో మొత్తం 194 మంది నుంచి నమూనాలను సేకరించారు. అందులో 72 మంది డాక్టర్లకు కరోనా నిర్ధారణ అయింది. అంతకుముందు ఎన్ఎంసీహెచ్లో 12 మంది డాక్టర్లు కరోనా బారినపడ్డారు. దీంతో, గత మూడు నాలుగు రోజులుగా ఈ డాక్టర్లను కలిసినవారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తున్నది. రాజధాని పట్నాలో మంగళవారం ఒకేరోజు 565 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో నిన్న 893 కొత్త కేసులు రికార్డయ్యాయి.