సిమ్లా : కరోనా థర్డ్ వేవ్ను సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికోసం రూ 23,123 కోట్లు కేటాయించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న అంచనాతో పీడియాట్రిక్ కేర్ను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా మంత్రి హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఈ వివరాలు వెల్లడించారు. కేంద్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తన స్వరాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి. మోదీ సర్కార్ మహమ్మారి నియంత్రణకు సమర్ధవంతంగా పనిచేస్తోందని అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఉచిత వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం రూ 35,000 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లను పెద్దసంఖ్యలో అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.