త్వరలోనే మరో రెండు స్వదేశీ ‘కోవిడ్ వ్యాక్సిన్లు’ అందుబాటులోకి రాబోతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండ్వియ సోమవారం జరిగిన పార్లమెంటు సమావేశంలో తెలిపారు. లోక్ సభలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసూటికల్ ఎడుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లును ఆయన ప్రవేశపెడుతూ ఈ విషయం ప్రస్తావించారు.
మాండ్వియ మాట్లాడుతూ.. “రాబోయే రెండు స్వదేశీ టీకాలను భారతీయ కంపెనీలు భారత దేశంలోనే తయారు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీలు తమ పరిశోధనల మూడో దశ ట్రయల్ డేటాను సమర్పించాయి. ఈ రెండు వ్యాక్సిన్ల పరిశోధన విజయవంతంగా పూర్తి కావాలని ఆశిస్తున్నాను. ఈ కరోనా వ్యాక్సిన్లని ప్రభుత్వ సహకారంతో భారతీయ శాస్త్రవేత్తలు కేవలం 9 నెలలలోనే తయరు చేశారు” అని అన్నారు.