న్యూఢిల్లీ: పెట్రో బాదుడు కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ సామాన్యుడిపై భారం మోపాయి. రోజువారీ సమీక్షలు భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోల్, డిజిల్పై 35 పైసల చొప్పున వడ్డించి వినియోగదారుల జేబుకు చిళ్లు వేస్తున్నాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.107.59కి చేరగా, డీజిల్ ధర రూ.96.32కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ రూ.113.46, డీజిల్ రూ.104.38కు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ రూ.108.11, డీజిల్ రూ.99.43, చెన్నైలో పెట్రోల్ రూ.104.52, డీజిల్ రూ.100.59కి చేరాయి.
కాగా, హైదరాబాద్లో పెట్రోలు, డీజిల్పై 37 పైసలు, 38 పైసల చొప్పున పెరిగాయి. దీంతో నగరంలో లీటరు పెట్రోల్ రూ.111.91, డీజిల్ రూ.105.08గా ఉన్నాయి. గత నెల 28 నుంచి నేటి వరకు 21 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇక డీజిల్ విషయానికి వస్తే.. గత నెల 24 నుంచి ఆదివారం వరకు 24 సార్లు ధరలు పెరిగాయి. ఇలా ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడి జీవనం భారంగా మారుతున్నది. చమురు ధరలు అధికమవుతుండంతో ప్రతి వస్తువు ధర పెరుగుతున్నది. దీనికి అనుగునంగా వారి సంపాదన లేకపోవడంతో బతుకు భారంగా వెళ్లదీస్తున్నారు.