న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా శుక్రవారం నాటికి భారత్ 50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి కీలక మైలురాయిని అధిగమించిందని చెప్పారు. మనం ఒక వారంలో పలు దేశాల జనాభా కంటే అధికంగా వ్యాక్సిన్లను వేస్తున్నామని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారితో వాటిల్లిన కొలువుల నష్టాన్ని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
నిర్మాణ, మౌలిక రంగాల్లో ముమ్మర కార్యకలాపాలతో ఉపాధి కల్పన ఊపందుకుంటోందని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు చేయూత ఇస్తున్నామని, రైతులను ఊరట కలిగించే చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రధాని మోదీ శనివారం మధ్యప్రదేశ్కు చెందిన పీఎంజీకేఏవై లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోందని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదరికం గురించి మాట్లాడటం మినహా వారికి ఎలాంటి సాయం చేయలేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.