చండూరు, జనవరి 6 : చండూరు మండల కేంద్రం సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన యువకుడు నల్లగొండలోని సాగర్ రోడ్డులో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. సెల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీకి బానిసై అప్పులు కావడంతో గ్రామంలోని రెండు ఎకరాల భూమిని అమ్మి అప్పులు తీర్చాడు.
గతంలో ఆడే పేకాట.. నేటి ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా అప్గ్రేడ్ అయ్యింది. గతంలో కొంతమంది ఊరికి దూరంగా రహస్యంగా ఆడే ఈ ఆట నేడు ‘ఆన్లైన్ రమ్మీ’ పేరుతో సెల్ఫోన్లలో ప్రత్యక్షమై అందరినీ బానిసలుగా మారుస్తున్నది. ఆన్లైన్ ఆటకు బానిసలై చాలా మంది వేల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
బానిస అవుతున్న యువకులు
ఆన్లైన్ రమ్మీతో డబ్బులు పోగొట్టుకుంటుండడంతో పోలీసుశాఖ దీనిని నిషేధించింది. అయినా కొంత మంది యువకులు దీనికి బానిసలై లోకేషన్ మార్చి మరీ ఆటలాడుతున్నారు. ఈ ఆట కారణంగా అప్పుల పాలవుతున్నారు. పిల్లలు చేసిన అప్పులకు తల్లితండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఆస్తులు అమ్ముకునేదాక పోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఈ ఆటకు దూరంగా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.
తోటి వారే పట్టించాలి…
ఆన్లైన్ రమ్మీ ఆడేవారిని పట్టుకోవటం కొంచం కష్టమే. ఆధారాలు దొరకక పోతే ఇబ్బందులు పడాల్సి వస్తుండడంతో పోలీసులు పెద్దగా ఆన్లైన్ రమ్మీ పట్ల దృష్టిసారించడం లేదు. ఈ సమస్యను సామాజిక బాధ్యతగా తీసుకుంటే అరికట్టడం సులువే. ఇప్పటికే పోలీసులు నలుగురు యువకులు గుమికూడి ఉంటే వారిని విచారిస్తూ ఆన్లైన్ రమ్మీ గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇటీవల రమ్మీ ఆడేవారితో పాటు బాధితులూ పెరుగుతున్నారు. డబ్బులు పోగొట్టుకున్నప్పటికీ బయటికి చెప్పుకుంటే పరువు పోతుందని భయపడుతున్నారు.
ఆస్తుల అమ్మకం
ఆన్లైన్ రమ్మీ ఆడి డబ్బులు సంపాందించవచ్చని ఆశపడి చాలా మంది దీనికి బానిసలుగా మారుతున్నారు. కానీ ఇందులో డబ్బులు పోగొట్టుకున్న వారే అధికంగా ఉంటున్నట్లు సమాచారం. చండూరుకు చెందిన ఓ యువకుడు ఇటీవల ఆన్లైన్ రమ్మీ ఆడి డబ్బులు పోగుట్టుకొన్నాడు. ఎంతగా అంటే అందిన కాడికి అప్పు చేశాడు. కుటుంబం రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి నెలకొనడంతో తల్లిదండ్రులు తమకున్న ఇంటి స్థలాన్ని అమ్మి అప్పులు తీర్చింది. మరో కుటుంబం తమ కొడుకు ఆన్లైన్ రమ్మీ ఆడి అప్పులపాలైతే ఉన్న ఇంటిని అమ్మి మరీ అప్పులు తీర్చి ఊరి విడిచిపెట్టి పోయింది. ఇలాంటి ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి.
నిర్మానుష్య ప్రాంతాల్లో..
ఆన్లైన్ రమ్మీ ఆడటానికి నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో గదులు అద్దెకు తీసుకొని మరి ఆడుతున్నారు. తరచూ స్థలాన్ని మారుస్తూ ఎవరి కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఎక్కువగా 18 నుంచి 30 ఏండ్ల లోపు వారే ఈ ఆటకు బానిసలుగా మారుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఒక సెల్ ద్వారా ఒక సారి ఆడితే తిరిగి మూడు రోజుల వరకు అవకాశం లేకపోవటంతో బయటి వ్యక్తుల సెల్ఫోన్లు అద్దెకు తీసుకొని మరీ ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సమాచారం ఇవ్వాలి
ఆన్లైన్ రమ్మీ మన ప్రాంతంలో నిషేధించబడింది. ఎవరైనా ఈ ఆట ఆడినా, ప్రోత్సహించినా చట్టరిత్యా చర్యలు తప్పవు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇప్పటికే ఆట ఆడుతున్నట్లు తెలిసినవారిపైన ఓ కన్నేసి ఉంచాం. త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయి. ఆన్లైన్ రమ్మీ మోసాలకు గురికాకుండా ఉండడంతో పాటు ఎవరైనా ఆడితే మాకు సమాచారం ఇవ్వాలి.
– నవీన్కుమార్, ఎస్ఐ, చండూరు