అర్వపల్లి, మార్చి 5 : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సా యంత్రం పారు వేట కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 15 రోజులపాటు ప్రతి రోజు జరిగిన ఒక ఉత్సవంలో అలిసి నారసింహుడు అమ్మవార్లు శ్రీదేవి, భూదేవితో కలిసి విశ్రాంతి కోసం అశ్వ వాహనంపై ఊరేగింపుగా వేటకు బయల్దేరారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి అటవీ ప్రాంతంలో వేటను ముగించుకొని తిరిగి రాత్రి ఆలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టారు. సోమవారం అర్ధరాత్రి దేవరాజ సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నటరాజ కళాబృందం నిర్వహించిన కొమ్ము కోయ, ఒగ్గు కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నరసింహస్వామి, చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి వేషధారణలు ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచార్యులు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్రెడ్డి, ధర్మకర్తలు రత్నం లక్ష్మాజీ, కృష్ణమూర్తి, రేణుక, సోమయ్య, నాయకులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.