యాదగిరిగుట్ట, జూన్28 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో పొటెత్తింది. స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తుల పోటీ పడ్డారు. కొండకింద పార్కింగ్ వాహనాలతో నిండిపోయింది. దర్శనానంతరం భక్తులు ప్రసాద విక్రయశాల వద్దకు చేరుకుని స్వామివారి ప్రసాదాన్ని కొనుగోలు చేయడంతో ప్రసాద విక్రయశాల కిక్కిరిసింది.
కొండపై, కొండ కింద పార్కింగ్ ఏరియా వాహనాలతో నిండిపోయింది. బస్టాండ్ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. స్వామివారి ధర్మ దర్శానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. స్వామివారిని 52 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా సాగాయి. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానకు రూ. 53,08,300 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్ తెలిపారు.