యాదగిరిగుట్ట, జూలై 28 : యాదగిరిగుట్ట ప్రధానాయలంలో లక్ష్మీనరసింహులకు నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సుదర్శన నారసింహ హోమం శాస్రోక్తంగా జరిపించారు. ఉదయం ఆలయ ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శ నారసింహ హవనం చేశారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహన సేవ చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కల్యాణాన్ని వీక్షించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు ధపాలుగా సువర్ణ పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. రాత్రికి స్వామి, అమ్మవార్ల శయనోత్సవ సేవను అర్చకులు ఘనంగా నిర్వహించి ద్వారబంధనం గావించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. ముత్తయిదువులు మంగళ హారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలలో శయనింపు చేశారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కార్యక్రమం కోలాహలంగా సాగింది. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.9,04,285 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
పాతగుట్ట ఆలయానికి వెండి కవచం, గడప బహూకరణ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధమైన పాతగుట్ట ఆలయానికి దాతలు వెండి సామగ్రి బహూకరించారు. సికింద్రాబాద్కు చెందిన శేరుపల్లి జ్యూవెలర్స్ ఎండీ శ్రీనివాస్, రజిత దంపతులు శుక్రవారం పాతగుట్ట ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి 2.034కిలోల వెండి కవచం, 499 గ్రాముల వెండి గడపను ఆలయ ఈఓ గీతకు అందించారు.