యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 20 : లక్ష్మీసమేతుడైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ అర్చకులు సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు నిర్వహించారు. సోమవారం కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి ప్రధానాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతు జరిపారు. కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి ప్రధానాలయంలో ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలు తులసీ అర్చన, నిత్య పూజలు వైభవంగా కొనసాగాయి. తెల్లవారుజామున సుప్రభాతం నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. దర్శనం అనంతరం ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి, దర్బార్ సేవలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రివరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 18 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.24,19,119 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
మహాశివరాత్రి ఉత్సవాలు పరిపూర్ణం
స్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు పరిపూర్ణం అయ్యాయి. ఆరురోజులపాటు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం చివరి రోజు ఉదయం నిత్యహవనం, శివపంచాక్షరి జపం, నందీశ్వర పారాయాణాలు, పంచసూక్త పఠనం, మూలమంత్ర జపములు నిర్వహించారు. పూర్ణాహుతి త్రిశూలతీర్థ కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం కొండపైన విష్ణు పుష్కరిణిలో త్రిశూల చక్రస్నాన ఘట్టాన్ని జరిపించారు. సాయంత్రం పారాయణికులచే స్తోత్ర, వేద నమక, చమక పారాయణములు, మంత్రపుష్ప పఠనాలు, సోమ కుంభార్చనలు, మూలమంత్ర పారాయణాలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల ఏకాంత శృంగార డోలోత్సవ వేడుకలు నిర్వహించి ఉత్సవాలను పరిపూర్ణం గావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, శివాలయ ప్రధానార్చకులు నరసింహరాముల శర్మ, ప్రధాన పురోహితులు గౌరీభట్ల సత్యనారాయణశర్మ, అర్చకులు, పురోహితులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.