యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 3 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలను నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వయంభూ నారసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి.
ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూ నారసింహస్వామిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 12 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 22,22,139 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులు కొండపైనే నిద్రించే విధంగా వసతి గృహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. శనివారం స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పురవీధులను కలియతిరిగారు. కొండపైన భక్తులకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. నమూనాలను, తాగునీటి సమస్య, భక్తులు సేద తీరాల్సిన స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ గతంలో మాదిరిగా కొండపైన భక్తులు సేదతీరేవిధంగా వసతి కల్పిస్తామన్నారు. క్యూ కాంప్లెక్స్లో ప్రత్యేకమైన గదిని వసతి గృహానికి కేటాయిస్తామని చెప్పారు. స్వామివారిని దర్శించుకునే భక్తులు కొండపైన కొబ్బరికాయ కొట్టేవిధంగా ప్రత్యేక స్థలం కేటాయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్భల భాస్కర్, వైటీడీఏ ఈఈ వెంకటేశ్వర్రెడ్డి, దేవస్థాన ఈఈ దయాకర్రెడ్డి, ఏఈఓలు గట్టు శ్రవణ్, గజవెల్లి రఘు, పర్యవేక్షకులు రాజన్బాబు పాల్గొన్నారు.