యాదగిరిగుట్ట, జూన్ 26 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయం మొదటి ప్రాకార మండపంలో కల్యాణమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు సేవను కొనసాగించారు. తూర్పునకు అభీష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని తిలకించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. తిరువారాధన జరిపి స్వామి, అమ్మవార్లకు బాలభోగం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు.
ఉదయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను గరుఢ, తిరుచ్చీ వాహనాలపై వేంచేపు చేసి సేవను ఊరేగించారు. రాత్రి దర్బార్ సేవ, నివేదన, శయనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. రామలింగేశ్వరుడి ఆలయంలో స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని జరిపారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయం మాఢవీధుల్లో ఊరేగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సుమారు 17 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ. 25,10,762 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.