యాదగిరిగుట్ట, జనవరి 6 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో శనివారం స్వాతి నక్షత్రపు పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖమండపంలో శత కలశాలను ఏర్పా టు చేసి శుద్ధ జలాలకు పూజలు చేశారు. పంచామృతాలతోపాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు.
వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం చేపట్టారు. స్వాతి నక్షత్రం సందర్భంగా తెల్లవారుజామునే భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొ దలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో నారసింహస్వామిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వా మివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు.
స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. సుమారు గంటన్నరపాటు జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు నిర్వహించిన తిరువీధి, దర్బార్ సేవల్లో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయం లో ఆర్జిత పూజలు వైభవంగా జరిగాయి. ధనుర్మాసోత్సవం 21వ రోజులో భాగంగా ప్రధానాలయంలోని మొదటి ప్రాకార మండపంలో అర్చకులు వేద మంత్రాలను పటిస్తూ తిరుప్పావై పూజలు చేపట్టారు. అర్చకులు గోదాదేవి, రంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠించారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ ఖజానాకు రూ.29,40,458 ఆదా యం సమకూరినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి పూజల్లో మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం యాదగిరిగుట్టకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు. శనివారం తెల్లవారుజామున అష్టోత్తర శత ఘటాభిషేకంలో భాగంగా నిర్వహించిన కలశ పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పంచనారసింహ స్వామిని దర్శించుకున్నారు.
ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు మాజీ గవర్నర్ దంపతులకు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈఓ రామకృష్ణారావు స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి దంపతులు, ఆలయ ప్రధానార్చకుడు కాండూరి వేంకటాచార్యులు, ఏఈఓ రఘు, తాసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆలయ అధికారులు సురేందర్రెడ్డి, రాజన్బాబు, సింహాచార్యులు పాల్గొన్నారు.