యాదగిరిగుట్ట, డిసెంబర్ 27 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఆళ్వారు దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు బుధవారం నాలాయిర దివ్య ప్రబంధ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారు ఉదయం వటపత్రశాయిగా, రాత్రి పరమపదనాథుడిగా(వైకుంఠనాథుడు) దర్శనమిచ్చారు.
ప్రధానాలయ తిరువీధుల్లో ఉత్సవమూర్తులతోపాటు స్వామివారి అలంకార సేవలను అత్యంత వైభవంగా చేపట్టారు. 12 మంది ఆళ్వారులు రచించిన దివ్య ప్రబంధ పారాయణాలను అర్చకులు, పారాయణదారులు పఠించారు. గురువారం అధ్యయనోత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు. ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి తిరుప్పావై ఘనంగా నిర్వహించారు.