యాదగిరిగుట్ట, మార్చి 24: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు జరిపించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య కల్యాణ తంతు జరిపించారు. తెల్లవారు జూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు.
అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108బంగారు పుష్పాలు ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. అనంతరం స్వామివారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు. ప్రధానాలయంలో సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. పాతగుట్టలో స్వామికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు.
వెలుపలి ప్రాకార మండపంలోని అద్దాల మండపంలో అమ్మవారికి బంగారు అభరణాలు, పట్టువస్ర్తాలతో ఆలంకరించి హారతినిచ్చారు. అనంతరం తిరుమాఢ వీధుల్లో సేవను ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 13వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 19,75,742 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. స్వామివారిని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కె.తిరుమల్రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారి రాంమోహన్ స్వామివారి ప్రసాదం అందించారు.
అనుబంధ పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సీతారామ చంద్ర స్వామి వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం యాగ మండపంలో సీతారామ హనుమత్ మూలమంత్ర జపాలు, దశశాంతి పంచసూక్త పారాయణాలతో అభిషేకాలు, ఆధ్యాత్మిక రామాయణ పారాయణం, సీతారామ హనుమత్ మూర్తులకు అష్టోత్తర శతనామార్చనలు చేశారు. సాయంత్రం సీతారామ హనుమత్ మూర్తులకు సహస్రనామార్చనలు, నివేదన, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్బల భాస్కర్, ఏఈఓలు, పర్యవేక్షకులు, భక్తులు పాల్గొన్నారు.