యాదగిరిగుట్ట, జూలై 24 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణోత్సవాన్ని సోమవారం ఘనంగా జరిపించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను ద్యివ మనోహరంగా అలంకరించి గజ వాహనంపై వేంచేపు చేసి సేవను కొనసాగించారు. సుమారు గంటన్నర పాటు సాగిన తిరు కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. స్వయంభువుడికి నిత్యోత్సవాలు తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, స్వామి, అమ్మవార్లకు బాలబోగం నిర్వహించారు. స్వామికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఉదయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సు దర్శన ఆళ్వారులకు కొలుస్తూ హోమం చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను గరుఢ, తిరుచ్చీ వాహనాలపై వేంచేపు చేసి ఆలయ ప్రాకార మండపంలో సేవను ఊరేగించారు. రాత్రి దర్బార్ సేవ, నివేదన, శయనోత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. రామలింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో స్పటిక లింగేశ్వరుడికి ప్రభాత వేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు నిర్వహించారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.15,87,494 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
గుట్టలో మంత్రి కేటీఆర్ పేరిట ప్రత్యేక పూజలు..
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు యాదగిరిగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కేటీఆర్ పేరిట సంకల్పం చేశారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, సర్పంచ్ తోటకూరి బీరయ్య, రైతుబంధు సమితి కన్వీనర్ మిట్ట వెంకటయ్య, బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ కాసావు శ్రీనివాస్గౌడ్, నాయకులు కాంటేకార్ పవన్, నరహరి పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి పూజలు
లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారి రాజన్బాబు స్వామివారి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో మంత్రి కేటీఆర్ నిండు నూరేండ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, ఆయనకు ప్రజలకు మరింత సేవ చేసేందుకు శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు కాంటెకార్ పవన్కుమార్ ఉన్నారు.