యాదగిరిగుట్ట, మార్చి 26: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. కొండపైకి వాహనాల రద్దీ సాగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వయంభువుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య తిరు కల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామిని సుమారు 40వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
వైభవంగా నిత్యోత్సవాలు
లక్ష్మీనరసింహ స్వామి నిత్య తిరు కల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవను నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. అనుబంధ పర్వతవర్దిణి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీతారామచంద్ర స్వామి వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సీతారామ హనుమత్ మూలమంత్ర జపాలు, దశ శాంతి పంచసూక్త పారాయణాలతో అభిషేకాలు, ఆధ్యాత్మిక రామాయణ పారాయణం, సీతారామ హనుమత్ మూర్తులకు అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.47,15,777 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్రెడ్డి
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి అభిషేక్రెడ్డి కుటుంబ సమేతంగా తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.