యాదగిరిగుట్ట, జూలై 27 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వెండిమొక్కు జోడు సేవ అత్యంత వైభవంగా సాగింది. గురువారం సాయంత్రం స్వామివారిని గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చీపై వేంచేపు చేశారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో ఊరేగించారు. జోడు సేవలో భక్తులు పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు నారసింహస్వామిని సుప్రభాతంతో మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది.
ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. సుమారు గంటన్నరకు పైగా నిత్యతిరు కల్యాణతంతు జరిపారు. సాయంత్రం స్వామివారికి దర్బార్ సేవ నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. సుమారు 6 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.10,87,675 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. దేవస్థానంలో నిర్వహించే ఆర్జితపూజల టికెట్లను విక్రయించేందుకు తాత్కాలికంగా బుక్కింగ్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. గురువారం ఇందుకు సంబంధించి స్థలాన్ని ఆలయ డీఈఓ భాస్కర్శర్మ, ఈఈ దయాకర్రెడ్డి పరిశీలించారు.
స్వామివారిని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ దర్శించుకున్నారు. గురువారం యాదగిరిగుట్ట కొండపైకి చేరుకున్న ఆయన మొదటగా స్వయంభూ పంచనారసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ పర్యవేక్షకుడు రామ్మోహన్ స్వామివారి ప్రసాదం అందజేశారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించడం అనందంగా ఉందని వెల్లడించారు.
భువనగిరి కలెక్టరేట్ : జిల్లా సందర్శనలో భాగంగా కలెక్టరేట్కు వచ్చిన బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెల్ను కలెక్టర్ పమేలా సత్పతి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై వివరించారు. ఆయన వెంట పొలిటికల్ అడ్వైజర్ నళినీరఘురామన్, ప్రొటోకాల్ అధికారి ఖాజామెయినుద్దీన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, యాదగిరిగుట్ట తాసీల్దార్, డీపీఎం ఉన్నారు.