యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 29 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. గురువారం ప్రధానాలయ వెలుపలి ప్రకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను జరిపారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణ తంతు చేపట్టారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరు కల్యాణ తంతు సాగింది. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్య కల్యాణ తంతును నిర్వహించారు.
భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించారు. స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గురువారం తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వయంభూ నరసింహస్వామిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాలను ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు.
అనంతరం స్వామివారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం చేశారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. సాయంత్రం స్వామివారికి తిరువీధిసేవ, దర్బార్ సేవ అత్యంత వైభవంగా చేపట్టారు.
రాత్రి వేళ స్వామివారికి తిరువారాధన, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 11వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.18,53,945 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజా వ్యవహారాల సలహాదారు వేం నరేందర్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.