యాదగిరిగుట్ట, జూలై 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో రూ.7.50కోట్లతో రెండు జల శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందులో మురుగు నీటిని శుద్ధి చేసేందుకు కొండ కింద ప్రెసిడెన్షియల్ సూట్ పక్కనే గల వైటీడీఏ స్థలంలో ఒకటి ఏర్పాటు చేయగా.. పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. అక్కడ శుద్ధి చేసిన జలాలను ప్రస్తుతం ప్రెసిడెన్సియల్ సూట్లో గార్డెనింగ్కు వినియోగిస్తున్నారు. దీంతోపాటు కొండపైన స్వామివారి ప్రసాదాల తయారీలో భాగంగా వెలువడే చమురు నీటిని శుద్ధి చేసేందుకు ఈటీపీ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి రానున్నది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వివిధ దేశాల సాంకేతికతను వినియోగించి, కొండపై, కొండ చుట్టుపక్కల మురుగు, చమురు నీటిని శుద్ధి చేసి వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారు.
ఇజ్రాయిల్ యూవీ సిస్టమ్ వినియోగం
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వివిధ దేశాల అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ యాదగిరిగుట్ట దేవస్థానంలో మురుగు జలాలను శుద్ధి చేస్తున్నారు. రూ.5కోట్లతో ఎస్టీపీ ప్లాంట్కు వివిధ దేశాల నుంచి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను వినియోగిస్తున్నారు. దీంతోపాటు ఇజ్రాయిల్ దేశానికి చెందిన యూవీ సిస్టమ్ను వినియోగించి మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు. హెచ్డబ్ల్యూఏఎస్ఎస్బీ డైరెక్టర్ శ్రీధర్బాబు, ఈడీ డాక్టర్ ఎం.సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్మాణాలు జరిగాయి.
మురుగు నీటి శుద్ధ్ది ఇలా..
దేవస్థానం నుంచి వచ్చే మురుగు నీరు ముందుగా ఎస్టీపీలోని ఇన్లెట్ చాంబర్లోకి వస్తాయి. ఇన్లెట్ చాంబర్లో ఉండే మెకానికల్ డ్యుయల్ స్లీనర్ ఆ నీటిలో ఉండే ప్లాస్టిక్, కాగిత ముక్కలను తీసివేస్తాయి. ఆ తర్వాత మురుగు నీళ్లు ఇన్లెట్ చాంబర్ పక్కనే ఉండే ఆర్ఎస్ఎస్ ట్యాంకులోకి చేరుతాయి. అందులో ఏ, బీ, సీ అనే పంపులు ఉంటాయి. ఒక పంపు మురుగు నీటిని స్టీలింగ్ చాంబర్లోకి పంపుతుంది. ఆ చాంబర్లో ఉండే 7ఎం.ఎం. స్లీనర్ సహాయంతో నీటిలో ఇంకా మిగిలివున్న చిన్న చిన్న చెత్త ఉండలను తీసివేసి నీటిని శుద్ధి చేస్తాయి. అక్కడి నుంచి ఈక్వులైజేషన్ ట్యాంకు 1, 2లోకి నీళ్లు వెళ్తాయి. అందులో బ్లేయర్స్తో వేరియేషన్ చేస్తూ మొదటి నీటి శుద్ధి వ్యవస్థ ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఏ, బీ, సీ పంపుల ద్వారా ఈక్యులేషన్ ట్యాంకు నుంచి ఆ పక్కనే ఉన్న రెండు ఎంబీబీఆర్ ట్యాంకులోకి నీటిని వదులుతారు.
అందులో బయో చిప్స్ మీడియాను వినియోగించి నీటిలో ఉన్న బ్యాక్టీరియాను పెంచుతారు. దీని ద్వారా నీటి శుద్ధి సులభతరం అవుతుంది. ఆ పక్కనే ఉండే అనాక్సిక్ ట్యాంకు ఏ, బీ ట్యాంకులోకి నీళ్లు చేరుకుంటాయి. నీటిలో ఉన్న నైట్రేట్ను నైట్రోజన్ గ్యాస్గా మార్చేందుకు అనాక్సిక్ ట్యాంకు వినియోగించి, నీటిని ఎంబీఆర్ (మెంబరెన్స్ బయో రియాక్టర్) ట్యాంకులోకి వదులుతారు. అందులో మైక్రో ఫిల్టరేషన్, ఆల్ట్రా ఫిల్టరేషన్ ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. చివరగా యూవీ సిస్టమ్ను వినియోగించి నీటిలో క్రిములు, ఇతర హానికర క్రిములను మైక్రో బయోలాజికల్ ద్వారా వేరు చేస్తారు. అనంతరం శుద్ధి చేసిన నీళ్లు నీటి ప్లాంట్లోకి వెళ్తాయి. రోజుకు 2.4 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే విధంగా యంత్రాల బిగింపు సాగింది. ఈ నీటిని తాగేందుకు కాకుండా కొండ చుట్టూ నాటిన మొక్కలు, గార్డెనింగ్తోపాటు వివిధ అవసరాలకు వినియోగించనున్నారు. ప్రస్తుతం ప్రెసిడెన్సియల్ సూట్లోని 10 ఎకరాల గార్డెనింగ్కు ఈ జలాలను వినియోగిస్తున్నారు. త్వరలో కొండ చుట్టూ గల గార్డెనింగ్కు వినియోగిస్తారు. ఇందుకు సంబంధించిన పనులు సాగుతున్నాయి.
చమురు నీటి శుద్ధికి ఈటీపీ ప్లాంట్
దేవస్థానంలో స్వామివారి లడ్డూ ప్రసాద కేంద్రం నుంచి వచ్చే చమురు నీటిని శుద్ధి చేసేందుకు ఈటీపీ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. స్వామివారి వైకుంఠ ద్వారం నుంచి మెట్ల మార్గం గుండా వెళ్లే ప్రాంతంలో గల నామాల గుండు వద్ద సుమారు 500 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో రూ.2.50 కోట్లతో ప్రత్యేకంగా ఈటీపీ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. కొండపైన లడ్డూ ప్రసాద విక్రయశాలలో ప్రత్యేకమైన పరికరాలతో స్వామివారి లడ్డూ ప్రసాదం, పులిహోర, చిరుధాన్యాల ప్రసాదాల తయారీలో నూనె, నెయ్యి, నీటిని వినియోగించనున్నారు. ప్రసాద విక్రయశాల నుంచి వచ్చే నూనె, నెయ్యి, వివిధ రకాల ముడి సరుకు కలిసి కలుషితమైన చమురు నీటిని ప్లాంట్లో వివిధ రసాయనాలతో వేరు చేసి శుద్ధి చేయనున్నారు. ఆ నీటిని గుట్ట చుట్టూ ఉన్న గార్డెనింగ్కు, చెట్లకు వినియోగించనున్నారు. 100 కేఎల్డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. రోజుకు 100 కిలో లీటర్ల నీటిని శుద్ధి చేసే విధంగా దీని నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్ పరికరాలు రానున్నాయి.