యాదగిరిగుట్ట, ఏప్రిల్16 : యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, ప్రసాద విక్రయశాల, క్యూ కాంప్లెక్స్ కిటకిటలాడాయి. సుమారు 46 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఖజానాకు రూ. 69,69,250 ఆదాయం సమకూరింది.
యాదగిరిగుట్ట, ఏప్రిల్16 : పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే కనిపించారు. ఆదివారం సెలవుదినం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తుల సందడిగా మారాయి. ప్రసాద విక్రయశాలలో సందడి నెలకొన్నది. కొండపైకి వాహనాల రద్దీ కొనసాగింది. స్వామివారి ధర్మదర్శానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్ర్తాలతో దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం శ్రీసుదర్శన నారసింహ హోమం ఘనంగా జరిపారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. సాయంత్రం వెండి మొక్కుజోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారిని సుమారు 46 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ. 69,69,250 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.