యాదాద్రి : యాదాద్రి లక్ష్మీ-నరసింహస్వామివారి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలలో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. లక్ష్మీ నృసింలను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన హోమం, లక్ష్మీ నరసింల కల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు.
మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. అన్ని విభాగాలను కలుపుకుని శ్రీవారి ఖాజానాకు రూ. 17,07,147 సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు.
నేడు యాదాద్రికి మంత్రి హరీశ్రావు రాక..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని విమానగోపురం స్వర్ణతాపడానికి బంగారం సమర్పించుకునేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రికి చేరుకుని లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. అనంతరం ఆలయ అధికారులకు స్వర్ణతాపడం నిర్మాణానికి బంగారం సమర్పించనున్నారు.