యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పునర్నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న యాగస్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ అర్కిటెక్చర్ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ గురువారం పరిశీలించారు. ప్రధానాలయం కొండకింద ఈశాన్య ప్రాంతంలో యాగాల నిర్వహణకు కేటాయించి 76 ఎకరాల స్థలాన్ని ఆలయ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా 1035 హోమ గుండాలకు యాగాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కావాల్సిన స్థలాన్ని పరిశీలించినట్లు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, త్రిదండ్డి చినజీయర్స్వామి సలహాలు సూచనల మేరకు హోమాలు జరపాల్సిన స్థలాల్లో ఏ ప్రాంతంలో గుండాలను ఏర్పాటు చేయాలో పరిశీలన చేశామన్నారు. నీటి వసతి, పార్కింగ్, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, వీవీఐపీ తాకిడిని తట్టుకునేలా రోడ్లు ఏర్పాట్లపై స్థల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నమూనాలను తయారు చేయనున్నట్లు వివరించారు.