యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. వేకువ జామునే ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన నిర్వహించారు. ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, అనంతరం తులసీ ప్రతాలతో అర్చన జరిపారు. దర్శనమూర్తులకు సువర్ణపుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేపట్టారు. బాలాలయంలోని మహామండపంలో సుదర్శన నారసింహహోమం, విశ్వక్సేనారాధన, నిత్యతిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి.
రాత్రి ఆరగింపు చేపట్టిన అర్చకులు అనంతరం స్వామివారికి పవళింపు సేవను నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలను పటిస్తూ తిరుప్పావై పూజలు అత్యంత వైభవంగా చేశారు. అర్చకులు గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలలో ఎనిమిదవ పాశురాలను పఠించారు. శ్రీవారి ఖజానాకు బుధవారం రూ. 7,35,308 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.