యాదాద్రి : లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన పూజలు శాస్రోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ఆగమశాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజలు కొనసాగాయి. ఈ లక్ష పుష్పార్చన పూజల్లో దేవస్థాన ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చకబృందం, పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
క్షేత్రపాలకుడికి ఆకు పూజ…
యాదాద్రి లక్ష్మినరసింహస్వామి సన్నిధిలోని విష్ణు పుష్కరిణి వద్ద ఆంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. హనుమంతుడిని సిందూరంతో ఆలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన జరిపారు. నిత్య పూజల్లో భాగంగా బాలాలయ మండపంలో శ్రీలక్ష్మి నర్సింహ నిత్య కల్యాణం చేశారు. తొలుత సుదర్శణ హోమం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు.
ఆంజనేయస్వామివారికి చందనంతో అభిషేకం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్య కల్యాణం నిర్వహించారు. ప్రసాద విక్రయాలు, సత్యనారాయణ స్వామివారి వ్రత పూజలతో పాటు వివిధ పూజలు కైంకర్యాలు, గదులు, పూజల నుంచి రూ. 13,87,092 ఆదాయం వచ్చినట్లుగా ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు.