దామరచర్ల, నవంబర్ 24 : పోడు భూముల విషయంలో అర్హులందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. పోడు భూములపై మండలంలోని రాళ్లవాగు తండాలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. పోడు భూములపై కబ్జాలో ఉన్న రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పోడు భూముల పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మండలంలోని 21గ్రామాల్లో పోడు భూముల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, ఆయా గ్రామాల పరిధిలోని అటవీ భూముల్లో క్షేత్రస్థాయిలో పది సర్వే బృందాలు సర్వేలు చేశాయన్నారు. అధికారులు పారదర్శకంగా సర్వేలు నిర్వహించాలని, రైతులు వారికి సహకరించాలని కోరారు. పోడు భూముల వ్యవహారంలో ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. దరఖాస్తు చేసుకోని అర్హులైన వారికోసం మరోమారు సర్వే చేయించి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమావత్ నందిని, గ్రామ సర్పంచ్ ధీరావత్ పున్నానాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కే.వీరకోటిరెడ్డి, నాయకులు రవితేజ, హాతీరాం, తులసీదాస్నాయక్ పాల్గొన్నారు.