యాదాద్రి, నవంబర్ 24 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొ ల్పి తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపించారు. ప్రధానాలయ ముఖ మండపంలో భక్తులు శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు.
సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి వేళలో స్వామివారికి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన చేశారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చనలు చేశారు. పాత గుట్ట స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 15వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.19,70,546 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
హుండీల ఆదాయం రూ.1.88కోట్లు
యాదాద్రి ఆలయ 15రోజుల హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. యాదాద్రి కొండకింద వ్రత మండపంలో హుండీలను లెక్కించగా రూ.1,88,28,754 ఆదాయం వచ్చిందని ఈఓ ఎన్.గీత తెలిపారు. మిశ్రమ బంగారం 70గ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 600గ్రాములు వచ్చిందని తెలిపారు. వీటితో పాటు 330 అమెరికా డాలర్లు, 5 యూఏఈ థిరామ్స్, 62 సింగపూర్ డాలర్స్, 10ఆఫ్రికా రండ్, 10యూరో, 16ఖతర్ రియల్స్, 50 మలేషియా నేగర, 50న్యూజిలాండ్ డాలర్స్, 200 నేపాల్ రూపీస్ సమకూరాయని తెలిపారు.