– యాదగిరిగుట్ట రూరల్,నవంబర్ 24:ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. దృష్టి సమస్యలను దూరం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నది. సీఎం కేసీఆర్ 2018లో ప్రారంభించిన మొదటి విడుత కార్యక్రమం సత్ఫలితాన్ని ఇవ్వడంతో మరోమారు నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి 18నుంచి గ్రామాలు, పట్టణాల్లో రెండో విడుత కంటి వైద్య శిబిరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించగా.. వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని 2023 జనవరి 18 నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశ మాదిరిగానే ఊరురా శిబిరాలు పెట్టి 18ఏండ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు చేయనున్నారు. సమస్యలున్నవారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేయనున్నారు. అవసరమైతే శస్త్ర చికిత్సలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా 9,901 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి కోటీ 54 మందికి కంటి పరీక్షలు చేశారు. అందులో అవసరమైన వారికి కాటరాక్ట్ సర్జరీలు, పెద్ద ఆపరేషన్లు చేశారు.
తొలి విడుతలో 3,79,901 మందికి పరీక్షలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 2018 ఆగస్టు నుంచి 2019 మార్చి వరకు తొలి విడుత కంటి వెలుగు కార్యక్రమంలో 17 వైద్య బృందాలు 401 గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు నిర్వహించాయి. మొత్తం 3,79,901 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,00,291 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. 46 వేల మందికి పైగా దగ్గరి చూపు ఇబ్బంది ఉన్నదని, 50 వేలకు పైగా మందికి దూరం చూపు ఉన్నదని గుర్తించారు. వారందరికీ మందులతోపాటు కళ్లద్దాలను ఉచితంగా అందజేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
మొదటి విడుత కంటి వెలుగు సత్ఫలితాలు ఇవ్వడంతో జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత కంటి వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. 2023 జనవరిలో ఈ శిబిరాలు ప్రారంభం కానున్నందున ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకొని నిర్దేశించే సమయానికి సన్నద్ధంగా ఉండాలని ముందస్తు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఈ సారి సుమారు 20 బృందాలను ఏర్పాటు చేయనున్నారు. తొలి విడుతలో శిబిరాల నిర్వహణకు జిల్లాలో ప్రత్యేకంగా ఎన్ని బృందాలు పని చేశాయి.. ఒక్కో బృందం ఒక్కో రోజు ఎంత మందికి పరీక్షలు నిర్వహించింది.. ఎలాంటి యంత్రాలను ఉపయోగించిందనే వివరాలను పరిశీలిస్తున్నారు. శిబిరాలు నిర్వహించాల్సిన గ్రామాలు, వార్డులను గుర్తిస్తున్నారు. ఎంత మందికి కంటి పరీక్షలు జరుపాల్సి ఉందనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే.. కంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ‘కేసీఆర్ కంటి వెలుగు కేంద్రాల’ను శాశ్వత ప్రాతిపదికన నెలకొల్పాలని తాజాగా సర్కారు నిర్ణయించింది. జిల్లా, ప్రాంతీయ దవాఖానలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నది.
– యాదగిరిగుట్ట రూరల్,నవంబర్ 24రెండో విడుత కంటి వెలుగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. కంటి వైద్య శిబిరాల నిర్వహణపై చర్చిస్తున్నాం. పీహెచ్సీల వారీగా బృందాల ఏర్పాటు, అవసరమైన మిషనరీల సేకరణ, ఇతర వసతులపై సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాం. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేస్తాం.
– డాక్టర్ మల్లికార్జున్, డీఎంహెచ్ఓ, యాదాద్రి భువనగిరి జిల్లా