యాదాద్రి : కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాల ఖాళీగా ఉన్నాయి.. దమ్ముంటే వాటిని నింపాలని బండి సంజయ్కు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యం కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సవాల్ విసిరారు. హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చి అంటున్నావ్.. నీవు చేయాల్సింది మిలియన్ మార్చి కాదు, ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయాలని ఇందుకు మా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విస్తృతస్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఒక లక్ష 32వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 70వేల ఉద్యోగాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఇందుకు ఉద్యోగుల విభజన పూర్తయిందన్నారు. ఫేక్ వాట్సాప్ యూనివర్శిటీ బీజేపీ అని అన్నారు. అసత్య ప్రచారాలు చేస్తూ బీజేపీ రాజకీయాలు చేస్తున్నారని దూయ్యబట్టారు. నీతి ఆయోగ్ ఇచ్చిన ఫలితాల్లో ఆరోగ్య సూచికలో ఏ రాష్ట్రం బాగుందనే విషయంలో 28 రాష్ట్రాల్లో టప్ 3లో తెలంగాణ ఉందని గుర్తు చేశారు. ప్రజారోగ్య సూచిలో చిట్టచివరి స్థానంలో ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించిన ఉత్తరప్రదేశ్ ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు నడుస్తున్నాయని అన్నారు. అంబేద్కర్పై కేసీఆర్ తప్పుగా మాట్లాడలేదన్నారు. తాను రాసిన రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడుస్తున్నారని, అవసరమైతే రాజ్యాంగాన్ని మళ్లీ రాయాలే, రద్దు చేయాలి అని రాజ్యాంగం రాసిన రెండు సంవత్సరాలకే రాజ్యసభలో అంబేద్కర్ మాట్లాడారని గుర్తు చేశారు. ఎస్సీ జనాభా పెరిగినా 15శాతం రిజర్వేషన్ ఉందన్నారు.
రాజ్యాంగంలో చిన్న మార్పు తీసుకువస్తే ఎస్సీలకు ఉద్యోగ, విద్య అవకాశాలలో 18 నుంచి 19 శాతం రిజర్వేషన్ వస్తుందని సీఎం కేసీఆర్ మాట్లాడటం తప్పా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. అసత్య ప్రచారాలను టీఆర్ఎస్ యువత తిప్పికొట్టాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా ఎక్కడిక్కడే సమాదానం చెప్పాలన్నారు. కార్యక్రమం ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు.