ఆలేరు రూరల్, ఫిబ్రవరి 28 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని కందిగడ్డతండా, గుండ్లగూడెం, శివలాల్తండా, కొల్లూరు, మందనపల్లి గ్రామాలకు మంజూరైన ఎస్డీఎఫ్ నిధులతో చేపడుతున్న సీసీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు సోమవారం ఆమె శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతాయన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన సీఎం కేసీఆర్ జిల్లాలోనే అన్ని గ్రామపంచాయతీలకు రూ.25లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారని తెలిపారు. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ నుంచి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్గౌడ్, సర్పంచులు ఏసిరెడ్డి మహేందర్రెడ్డి, కోటగిరి పాండరి, కోటగిరి జయమ్మ, కేతావత్ సుజాత, వడ్ల నవ్యాశోభన్బాబు, ఒక్క రాంప్రసాద్, వంగాల శ్రీశైలం, ఆరుట్ల లక్ష్మీప్రసాద్రెడ్డి, ఎంపీటీసీ జూకంటి అనూరాధాఅనిల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిడాల నర్సింహులు, టీఆర్ఎస్వీ యువజన విభాగాల మండలాధ్యక్షులు మామిడాల భానుచందర్, అయిలి కృష్ణ, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జంపాల సత్యనారాయణ, వెంకటపాపిరెడ్డి పాల్గొన్నారు.