దేవరచర్ల మునిస్వామి ఆలయానికి శివరాత్రి శోభ
నంది ఆకారంలో లింగం, నిత్య జలాభిషేకం
ప్రకృతి అందాలకు తోడు ఆధ్యాత్మిక శోభ
చందంపేట, ఫిబ్రవరి 27 :చుట్టూ దట్టమైన వనం.. కనువిందు చేసే పచ్చదనం, చూడముచ్చటైన జలపాతం.. ప్రకృతి అందాల నడుమ నల్లమల అటవీ ప్రాంతంలో శివయ్య దర్శనం భక్తులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. చందంపేట మండలంలోని దేవరచర్లకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై కొలువుదీరిన చారిత్రాత్మక మునిస్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. నంది ఆకారంలో శివలింగం ఇక్కడ ప్రత్యేకత కాగా, నిత్యం జలాభిషేకం జరుగడం మరో విశేషం. ఏకాదశి, మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సుమారు 13,14 శతాబ్దాల మధ్య కాలంలో రేచర్ల పద్మనాయకులు దేవరచర్ల దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది. దేవరకొండ ఖిల్లాకు ఇక్కడి ఆలయానికి సంబంధాలు ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయంలో నంది ఆకారంలో శివయ్య కొలువుదీరి ఉన్నాడు. దేవాలయం ముందు మండపం 18 స్తంభాలతో నిర్మించగా.. విశేష కళాసంపదకు నిలయమై ప్రకృతి అందాలతో భక్తులను ఓలలాడిస్తున్నది.
నిత్యం జలాభిషేకం…
దేవరచర్ల నుంచి 5 కిలోమీటర్లు కాలినడకన దేవాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. మార్గమధ్యంలో మరికొన్ని ఆలయాలు దర్శనమిస్తుంటాయి. ఆలయం వద్ద పురాతన దేవతామూర్తుల విగ్రహాలు, గర్భగుడిలో శివయ్యను నిత్యం గంగమ్మ అభిషేకం చేసే దృశ్యం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతుంది. హర హర మహాదేవ అంటూ భక్తులు గుట్టను చేరుకుంటారు. నియమనిష్టలు పాటిస్తూ దేవాలయానికి చేరుకోవాలని లేదంటే గబ్బిలాలు, కందిరీగలు దాడి చేస్తాయని స్థానికులు తెలిపారు.
ఏలేశ్వరానికి బోటు ప్రయాణం..
వైజాగ్ కాలనీ నుంచి సాగర్ బ్యాక్వాటర్లో పడవల ద్వారా గంట ప్రయాణిస్తే ఏలేశ్వరం చేరుకోవచ్చు. కంబాలపల్లి నుంచి అరగంట సమయం పడుతుంది. మహాశివరాత్రి నేపథ్యంలో భక్తుల రాకపోకలు పెరిగాయి. శివరాత్రి రోజున పెద్ద ఎత్తున తరలిరావడంతో పరిసరాలు జాతరను తలపిస్తాయి.