యాదాద్రి, ఫిబ్రవరి 26: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఇలవేల్పు దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ పురవీధులు, లడ్డూ ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామి వారి నిత్యపూజల కోలాహలం తెల్లవారు జామున 4గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో స్వామి వారికి ఆరాధనలు ప్రారంభించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు లక్ష్మీసమేత నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. హారతి నివేదనలతో అర్చించి, సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. పాతగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. స్వామిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి ఖజానాకు ఆదివారం రూ. 15,09,873 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.