యాదాద్రి, ఫిబ్రవరి 26 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధినీ రామలింగేశ్వర స్వామి బాలాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలకు ఆలయ పూజారులు శనివారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు బాలశివాలయంలో ఉదయం 10గంటలకు స్వస్తివాచనం నిర్వహించారు. విశ్వశాంత్యర్థం ఈ వేడుక నిర్వహిస్తారు. స్వస్తివాచనంతో లోకంలోని సర్వవిఘ్నాలు, సర్వవిధ దోషాలు తొలగి ఈశ్వర అనుగ్రహం కలగాలని, శైవాగమ సాంప్రదాయ రీతిలో వేడుక జరిపించారు. ఉత్సవాల్లో జరిపే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణం అయ్యేలా అనుగ్రహించమని ప్రార్థిస్తూ విఘ్వేశ్వర ఆరాధన జరిపించారు. పవిత్రమైన జలంతో వేదమంత్ర పఠనంతో పూజ ద్రవ్యాలను ఆలయ పరిసర ప్రాంతంలో ప్రోక్షణ గావించి శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమం చేపట్టారు. పరమేశ్వర అనుగ్రహంతో మహాశివరాత్రి ఉత్సవాలు సక్రమంగా జరుగాలని శాస్ర్తోక్తంగా రక్షా బంధనాలు, పూజాధికాలు నిర్వహించారు. ఉత్సవాలు సక్రమంగా జరుగాలని ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, యాజ్ఞికులు, ఆలయ అర్చకులు, భక్తులను రక్షబంధనాలను ధరింపజేశారు.
ప్రత్యేక పూజలు
మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం పారాయణికులచే నమక, చమక పారాయణాలు, మంత్రపుష్ప పఠనం, అంకురారోపణం, సోమకుంభ, కలశస్థాపన, దేవతారాధన వంటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. వేడుకల్లో ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఏఈఓలు రమేశ్బాబు, శ్రవణ్కుమార్, అర్చకులు సత్యనారాయణశర్మ, శివాలయ ప్రధానార్చకులు నర్సింహరాములశర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.