యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను జలాశయాల్లో వదులుతున్నది. జిల్లాలో 2018-19 సంవత్సరంలో 99లక్షల చేప పిల్లలను, 2019-20లో 2.15కోట్లు, 2020-21లో 2.20కోట్ల చేప పిల్లలను జిల్లా మత్స్యశాఖ చెరువుల్లో వదలగా.. ఈ ఏడాది 1,115 చెరువుల్లో 3.16కోట్ల చేప పిల్లలను వదిలింది. 80-100 ఎంఎం సైజు గల ఒక్కో చేప పిల్ల కోసం రూ.1.55, 35-40 ఎంఎం సైజున్న పిల్లల కోసం 60పైసల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది వదిలిన చేప పిల్లల కోసం రూ.కోటికి పైగా వెచ్చించింది.
రూ.30వేల తలసరి ఆదాయం పొందేలా..
జిల్లా వ్యాప్తంగా 127 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, మరో 8 వరకు మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 8,829 మంది సభ్యులు ఉన్నారు. గత ఏడాది చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదలగా.. మత్స్య ఉత్పత్తితో రూ.56 కోట్లకు పైగా ఆదాయాన్ని మత్స్యకార్మికులు అందిపుచ్చుకున్నారు. ఈ లెక్కన ఒక్కో సభ్యుడికి రూ.69వేల చొప్పున లబ్ధి కలిగింది. ఈ ఏడాది కూడా ప్రతి సభ్యుడు ఎంతలేదన్నా రూ.30వేల చొప్పున ఆదాయం పొందేలా చేయూత కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన చేపలు కోల్కతా, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. హైదరాబాద్ చెంతనే ఉండడం వల్ల చేపలకు మార్కెటింగ్ సౌకర్యాన్ని సైతం కల్పించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
10 లక్షల రొయ్యల పెంపకానికి కసరత్తు
చెరువుల్లో గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రొయ్యల పెంపకం చేపట్టేందుకు జిల్లా మత్స్యశాఖ దృష్టి సారించింది. గత సంవత్సరం బీబీనగర్, జైనపల్లితోపాటు రామన్నపేట మండలం మునిపంపుల గ్రామ చెరువుల్లో రొయ్య పిల్లలు వదిలారు. రొయ్యల పెంపకం సత్ఫలితాలు ఇవ్వడంతో ఈసారి కూడా వదలాలని సంబంధిత శాఖ సంకల్పించింది. బీబీనగర్, జైనపల్లి, మునిపంపుల చెరువులతోపాటు తంగేడువనం, తుమ్మలగూడెం, బొల్లేపల్లి, మొగలిపాక తదితర చెరువుల్లోనూ రొయ్యలను పెంచేందుకు నిర్ణయించింది. మొత్తం 10లక్షల రొయ్య పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇప్పటికే చాలాచోట్ల ఈ ప్రక్రియ మొదలైంది. నీలి విప్లవంతో చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదలడంతో ప్రస్తుతం పల్లె, పట్టణ వాసులకు తక్కువ ధరకే చేపలు దొరుకుతున్నాయి.
మత్స్యశాఖ పరిధిలోకి 950 చెరువులు..
చేపల చెరువులపై ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఇటీవల ప్రభుత్వం అన్ని చెరువులను మత్స్యశాఖ పరిధిలోకి తెచ్చింది. జిల్లాలో 161 పెద్ద చెరువులు, 1,043 చిన్న చెరువులు, మూసీ పరీవాహక ప్రాంతం వెంట మరో 20 చెరువులు ఉన్నాయి. ఇందులో 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులు 160 వరకు ఉన్నాయి. కొన్ని చెరువులు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో, మరికొన్ని మత్స్యశాఖ పరిధిలో ఉండడం.. ఈ రెండు శాఖల మధ్య సమన్వయలోపం వల్ల పర్యవేక్షణ అంతగా ఉండేది కాదు. ఇష్టారీతిన చెరువులను లీజుకు ఇవ్వడంతో అవినీతి, అక్రమాలకు తావుండేది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని చెరువులన్నింటినీ మత్స్యశాఖ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ 268ని జారీ చేసింది. దీంతో జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న 950 వరకు చెరువులు మత్స్యశాఖ పరిధిలోకి వచ్చాయి. చెరువుల లీజు బాధ్యతను కూడా ప్రభుత్వం మత్స్యశాఖకే అప్పగించింది. ఇకపై చెరువులు, కుంటల లీజును స్థానికంగా ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు కేటాయిస్తారు. సంఘాలు లేనిచోట బహిరంగ వేలం నిర్వహిస్తారు. వేలం ద్వారా వచ్చిన సొమ్మును గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేయనుండడంతో లీజు రూపేణా వచ్చే ఆదాయం పంచాయతీ అభివృద్ధికి దోహదపడనుంది.
ఆర్థిక తోడ్పాటుకు అనేక పథకాలు..
సమీకృత మత్య్స అభివృద్ధి పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు మూడు చక్రాల వాహనాలను, ఇన్సులేటెడ్ వెహికల్స్ను 800 మందికి అందించారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద చేపల చెరువుల తవ్వకం కోసం హెక్టారుకు రూ.7లక్షల రాయితీ ఇస్తున్నారు.
నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ సౌజన్యంతో మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్లెట్ల థూర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూనిట్ విలువ రూ.10లక్షలు కాగా.. 60శాతం సబ్సిడీ ఇస్తున్నారు. జిల్లాలో మూడు వాహనాలు ఏర్పాటు చేయనుండగా.. త్వరలో ఒకటి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రమాదవశాత్తు మృతిచెందిన మత్స్యకారులకు ప్రభుత్వం రూ.6లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తున్నది.
కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఒక్కో సొసైటీ సభ్యుడికి బ్యాంకుల నుంచి రూ.25వేల రుణం అందిస్తున్నారు. 600 మంది దరఖాస్తు చేసుకోగా.. 50 వరకు దరఖాస్తులు బ్యాంకర్ల వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఈ-శ్రమ్ కార్డులు పొందినవారికి యాక్సిడెంటల్ పాలసీ వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 400 మందిని ఇందులో నమోదు చేయించారు.
ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి
ఈ ఏడాది కూడా చెరువుల్లో చేప పిల్లలను వదిలాం. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకార్మికులకు చేపల యూనిట్, ఐస్ ప్లాంట్ల నిర్మాణం, సబ్సిడీపై వాహనాలను అందిస్తున్నాం. చేపలను విక్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. మహిళా మత్స్యకార సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ సమకూర్చి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడేలా చర్యలు చేపడుతున్నాం. గతానికి భిన్నంగా చేప పిల్లలను ఉచితంగా అందించి వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా మా శాఖ తరఫున చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుని మత్స్యకార్మికులు ఆర్థికంగా ఎదుగాలి.
– ఎం.రాజారాం, జిల్లా మత్స్యశాఖ అధికారి